ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలను నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 67.26 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కాస్త ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో రాయనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చినా వారిని కంపార్టుమెంటల్ పాస్ కింద చూడరు. సప్లిలో విద్యార్థులకు వచ్చే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే వారికి కూడా డివిజన్లను కేటాయించనున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు వెల్లడించారు.
ఫెయిలైన విద్యార్థుల వివరాలను జూన్ 7న అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. ఫెయిలయిన విద్యార్థులు సప్లమెంటరీ ఎగ్జామ్ కు సంబంధించిన ఫీజు చెల్లించేందుకు ఈ రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
నేటి నుంచి 20వ తేదీ వరకు చెల్లించే అవకాశం కల్పించింది ఏపీ విద్యాశాఖ. రూ. 50 లేట్ ఫీజుతో ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చని మంత్రి నిన్న ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ను త్వరలో విడుదల చేస్తామని మంత్రి చెప్పారు
రెండు రోజుల్లో షార్ట్ మెమోలు..
టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు తమ మార్కులకు సంబంధించి షార్ట్ మెమోలను www.bse.ap.gov.in వెబ్సైట్లో రెండు రోజుల తరువాత పొందవచ్చునని మంత్రి బొత్స తెలిపారు. విద్యార్థులు ఈ మెమోల ద్వారా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందవచ్చు. విద్యార్థులు జూన్ 20వ తేదీ లోపు రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీల కోసం ఒక్కో పేపర్కు రూ.1,000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తాజా ఫలితాలలో 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు