కరోనాను కట్టడి చేసే కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత కూడా ప్రజలు బయటికి రారనే భావిస్తున్నామని అన్నారు. .మరో రెండ్రోజులు కర్ఫ్యూ పొడిగించాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్ వద్ద జరిగిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇతర ఏజెన్సీలు, విభాగాలతో పోలీసులు కలిసి పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు.
విదేశాల నుంచి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి ఇక్కడికి చేరుకున్నవాళ్లు తప్పనిసరిగా వైద్యశాఖకు సమాచారం అందించాలని, వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ పాటించాలని హితవు పలికారు. వైద్యపరమైన సూచనలు పాటించకుంటే ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు అని గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.