నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. రేపు కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ భేటీకి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలన్న విషయమై చంద్రబాబు సీఎస్ తో సమాలోచనలు జరిపారు.
ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి బయలుదేరారు. ఈరోజు సాయంత్రానికల్లా మంత్రిమండలి సమావేశంపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు సీఎంకు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈసీ నుంచి అనుమతి వస్తుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.