telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఈ రోజు ఉదయం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.

మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన సీఎం, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు. మండలి రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ సర్కార్ పంపనుంది.

Related posts