ఏపీసీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఇవాళ అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్… ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ధర్మవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభపైనే జగన్ 47వ జన్మదిన వేడుకలు కూడా జరపనున్నట్లు తెలిసింది. నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది.
అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచీ ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే జగన్ ప్రకటించారు.