అక్రమ ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని… కోర్టుకు హాజరుకాకుండా ఉంటే, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఆయన తరఫు న్యాయవాదులు, అలాగే సీబీఐ తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు.
జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, దీంతో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్ వాదిస్తూ, జగన్ ను ఉద్దేశించి సీబీఐ ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీబీఐ తరపు లాయర్ వాదిస్తూ ఇది ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు అని… ఇలాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ, నవంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.