ప్రధాని మోదీ రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. చివరికి సోనియా అల్లుడు వాద్రాను కూడా ఈడీ విచారణకు పిలిపించారన్నారు. గురువారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని వ్యవస్థలను మోదీ భష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లో బాగా క్లిక్ అయ్యాయని, జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. జగన్, వైసీపీ నేతలకు సిద్ధాంతాలు, విలువలు లేవని విమర్శించారు.
మైలవరం పోలీసులను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని వైసీపీ నేతల ప్రయత్నాల చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇప్పటి నుంచే డబ్బు సంచులు బయటకు తీస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వ్యవహారాలపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు. ఈ నెల 10న ప్రత్యేక హోదా, విభజన హామీలపై నిరసనలు తెలపాలని చెప్పారు. 11న ఢిల్లీ దీక్షలో నేతలందరూ పాల్గొనాలని సూచించారు.