ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియను చేపట్టబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. రాజధాని తరలింపుపై జేఏసీ దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారించింది. రాజధానిని విశాఖకు తరలించే యత్నం చేస్తున్నారంటూ పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు ఆమోదం కాకుండా తరలింపు ప్రక్రియ చేపట్టబోమని న్యాయస్థానానికి ఏజీ చెప్పారు.
దీంతో ఇదే అంశంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం పదిరోజుల సమయాన్ని కూడా ఇచ్చింది. కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ లోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్న ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. అయితే రాజధాని తరలింపును ఆపడం ఎవరితరం కాదని ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. దీంతో పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఏజీకి కోర్టు సూచించింది.