ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాలు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడాన్ని టీడీపీ తప్పుబడితే.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై జగన్ సెటైర్లు విసిరారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేటప్పడు చంద్రబాబు గాడిదలు కాశారా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చక్రం తిప్పుతున్నప్పుడే ఆల్మట్టి డ్యాం ప్రాజెక్టు కట్టారని గుర్తు చేశారు.
తెలంగాణలో నుంచి గోదావరి పారుతుందని, ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్… శ్రీశైలంకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళితే తప్పేంటని జగన్ సమర్థించుకున్నారు. జగన్ వ్యాఖ్యల పై స్పందించిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవమంత వయసు ఉండదని జగన్కు కౌంటర్ ఇచ్చారు. దీంతో జగన్ ఒక్కసారిగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అన్నీ తనకు తెలుసుసని విర్రవీగడం మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. కేసీఆర్ హిట్లర్ అని, కాళేశ్వరం వస్తే తెలంగాణ, ఆంధ్ర పాకిస్థాన్ మాదిరి అవుతాయని జగన్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.