బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. తన తల్లి దులారి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు.
ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని అనుపమ్ ఖేర్ చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అనంతరం తన సోదరుడు రాజు ఖేర్, మరదలు, మేనకోడలుకి కూడా కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తాను కూడా కరోనా పరీక్ష చేయించుకున్నానని నెగెటివ్ వచ్చిందని తెలిపారు.