మరో హైదరాబాదీ న్యూజిలాండ్ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ డబీర్పురలోని నూర్ఖాన్ బజార్కు చెందిన ఓజైర్ ఖదీర్ (25) తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. దీనితో ఉన్మాది దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 50కి చేరగా, తెలంగాణవాసుల సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్ టోలిచౌకికి చెందిన ఫర్హాజ్హసన్, కరీంనగర్కు చెందిన ఇమ్రాన్ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఓజైర్ జాడ తెలియడం లేదని, ఆదివారం తెల్లవారుజామున న్యూజిలాండ్లోని భారత రాయబార కార్యాలయం అధికారులు తమకు ఫోన్చేసి అతడి మృతివార్తను చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఓజైర్ తండ్రి అబీబ్ ఖదీర్ సౌదీ అరేబియాలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, సోదరుడు ఓమైర్ ఖదీర్ ఇండిగో ఎయిర్లైన్స్లో పైలట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఓజైర్ ఏవియేషన్లో శిక్షణ పొందడానికి గత ఏడాది న్యూజిలాండ్కు వెళ్లారు. క్రైస్ట్చర్చ్ ప్రాంతంలో ఉంటున్నారు. శుక్రవారం ప్రార్థన కోసం మసీద్కు వెళ్లగా ఉన్మాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఉన్మాది కాల్పుల్లో మృతిచెందిన, గాయపడిన రాష్ట్రవాసుల కుటుంబసభ్యులు, బంధువులు న్యూజిలాండ్కు బయలుదేరివెళ్లారు. ఓజైర్ ఖదీర్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు అతడి సోదరుడు ఓమైర్ ఖదీర్ న్యూజిలాండ్కు వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో మృతుడు ఫర్హాజ్హసన్ తల్లిదండ్రులు ఆదివారం రాత్రి బయలుదేరుతున్నట్టు సమాచారం. వారు హసన్ మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాల్పుల్లో గాయపడి చికి త్సపొందుతున్న అంబర్పేటకు చెందిన ఇక్బా ల్ జహంగీర్ సోదరుడు ఖుర్షీద్ శనివారం రాత్రే న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్రయత్నించినా విమాన టిక్కెట్ దొరుకకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఆదివారం రాత్రికి బయలుదేరే అవకాశం ఉంది. బాధితుల కుటుంబ సభ్యులను న్యూజిలాండ్కు పంపేందుకు విదేశీవ్యవహారాలశాఖ అవసరమైన సహాయం చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకం గా హెల్ప్లైన్ నంబర్ను కేటాయించింది.