ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడిచోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసు లో ఇంకా స్పష్టత రాకముందే మరోదాడికి అవకాశాలు ఉన్నాయంటూ స్వయంగా టీడీపీనే వైసీపీ వర్గాలకు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం విశేషం. అయితే రేపటితో ముగుస్తున్న ప్రజాసంకల్ప యాత్ర అనంతరం జగన్ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునే మార్గమధ్యంలో ఎక్కడైనా ఈ దాడికి అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాలు తెలిపినట్టు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 9న ఇచ్ఛాపురంలో నిర్వహించనున్న ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి కోరారు. పైలాన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర మొదలుకొని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుపడుతున్నా సజావుగా సాగిందన్నారు. పాదయాత్రలో వచ్చిన ప్రజాదరణ చూడలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఆటం కాలు సృష్టించినా భగవంతుడు ఇచ్చిన బలం, ప్రజల సహకారంతో పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందన్నారు.
పాదయాత్ర పూర్తయిన వెంటనే జగన్ తిరుమలకు అలిపిరి నుంచి కాలి నడకన వెంకన్న దర్శనానికి వెళ్లనున్నారని, ఈ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు జగన్పై దాడి చేసే అవకాశం ఉందని టీడీపీ నుంచే సమాచారం వచ్చిందన్నారు. జగన్పై హిందుత్వ దాడి చేసే కుట్రకు చంద్రబాబు తెరతీస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని చెప్పారు. జగన్ తిరుమలలో మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రఘు రాం, ఎన్ఆర్ఐ రత్నాకర్, పైలాన్ స్థల, నిర్మాణ దాత, కేవీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్యాంప్రసాద్రెడ్డి, తాడి ఆదిరెడ్డి, సత్తిరెడ్డి, మోహనరావు, సీహెచ్ దేవరాజ్ పాల్గొన్నారు.