ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని అన్నంబొట్లవారిపాలెంలో ముందస్తు సంక్రాతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక గొట్టిపాటి హనుమంతరావు ప్రాంగణం ఎడ్ల పోటీలతో హోరెత్తింది. 31వ రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. శనివారం రెండవ రోజు పళ్ల విభాగంలోని ఎడ్ల పోటీలను వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాధం బాబు ప్రారంభించారు. ఈ పోటీల్లో నిర్ణీత 10 నిమిషాల్లో 8 క్వింటాళ్ల బరువు గల బండను ఎడ్లు లాగడం విశేషం.
గుంటూరు జిల్లా సొరంగంపల్లికి చెందిన ఇసరాజుల శ్రీనివాస్ యాదవ్ కంబైన్డ్ గా, పత్తిపాడు మండలం పాలమల్లయ్య గ్రామానికి చెందిన పుల్లగూర యోహాన్ ఎడ్ల జత 4200 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. నర్సరావుపేట మండలం కోణ్డకపూర్ కు చిందిన మర్రి శ్రీనివాస్ కంబైన్డ్ గా షవ్వలాపురం మండలం పిచుకలపాలెం గ్రామానికి చెందిన కంచర్ల లక్ష్మణ్ రావు జత ద్వితీయ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మునుగోడు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎడ్ల జత తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతిగా రూ. 70,116, ద్వితీయ బహుమతిగా రూ. 45,116, తృతీయ బహుమతిగా రూ. 25,116 నిర్వాహకులు గొట్టిపాటి రవికుమార్, కిరణ్ బాబు శ్రీనివాస్ బాబు అందజేశారు.