ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఇటీవలే పదోతరగతి పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 27న ప్రారంభమై మే 9వ తేదీ వరకు జరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 6,22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. ఈనెల 13న పేపర్ల వాల్యుయేషన్ మొదలైంది. ఇప్పటికే 25శాతం మూల్యాంకనం పూర్తవగా.. వారం పదిరోజుల్లో మిగిలిన ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశముంది.
ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. మూల్యాంకనం పూర్తైన వెంటనే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
మూల్యాంకనం, డీ కోడింగ్ పూర్తైన వెంటనే జూన్ 10వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని దేవానంద రెడ్డి తెలిపారు. అనుకున్న సమయానికి ప్రక్రియ పూర్తైతే జూన్ 10నే రిజల్ట్స్ వచ్చేస్తాయని తెలిపారు.