నేడు అమిత్ షా జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు.. అందులో భాగంగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన పోలీసు ఇన్స్పెక్టర్ అర్షద్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతనాగ్లో జూన్ 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్ కుటుంబం నగరంలోని బాల్గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. షా రాక సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించారు. అటువైపు ఎవరూ రాకుండా ట్రాఫిక్ను దారిమళ్లించారు. ‘దేశ రక్షణ కోసం అర్షద్ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడింది. అర్షద్ ఖాన్ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోంది’ అని అమిత్ షా అన్నారు. అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిత్రాలను ట్విటర్లో పోస్ట్ చేశారు.
అర్షద్ ఖాన్కు భార్య, నాలుగు, ఏడాది వయసున్న కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల ఆ చిన్నారిని షా దగ్గరకు తీసుకొన్నారు. జమ్మూకాశ్మీర్ లో జూన్ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న అనంతనాగ్లోని సర్దార్ పోలీస్స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా అర్షద్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం దిగగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన దేహంలో గుళ్లు దిగినా అలాగే ముష్కరులపై ఎదురుదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదు: నితిన్ గడ్కరీ