ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఓ టూరింగ్ టాకీస్ యజమాని పాత్రలో నటించి దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘హౌస్ఫుల్’. ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి పార్తీబన్ సన్నాహాలు చేస్తున్నారు. హిందీ రీమేక్లో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్బచ్చన్ను నటింపజేయాలని ఆయన భావిస్తున్నారు. దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 1999లో విడుదలైన హౌస్ఫుల్ చిత్రంలో విక్రమ్, రోజా, సువలక్ష్మి, ఐశ్వర్యా, స్వాతి, వడివేలు తదితరులు నటించారు. మదురైలో ఓ టూరింగ్ టాకీసులో సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఆ టాకీసులో తీవ్రవాదులు బాంబులు పెడతారు. దీంతో పోలీసులు, బాంబ్స్క్వాడ్ నిపుణులు రంగంలోకి దిగుతారు. సినిమా ప్రదర్శన జరుగుతుండగానే ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట జరుగకుండా అందరినీ నెమ్మదిగా బయటకు తీసుకువచ్చేందుకు టూరింగ్ టాకీసు యజమాని, పోలీసులు చర్యలు తీసుకుంటారు. ప్రేక్షకులందరినీ టూరింగ్ టాకీసు నుంచి బయటకు తీసుకువస్తారు. ఆ సమయంలో థియేటర్లో ప్రదర్శిస్తున్న సినిమాలో ఓ పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది. లోపల పసిబిడ్డ చిక్కుకుందనుకున్న ఆ టూరింగ్ టాకీసు యజమాని లోపలకు వెళ్ళడం అదే సమయంలో బాంబులు పేలి థియేటర్ తునాతునకలవుతుంది. థియేటర్ యజమాని ప్రాణాలు కోల్పోతాడు. ఇలా పటుత్వమైన స్ర్కీన్ ప్లేతో పార్తీబన్ ప్రేక్షకులను కదలనీయకుండా కట్టిపడేశాడు. ఇంతటి విశేషాలు సంతరించుకున్న ‘హౌస్ఫుల్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి పార్తీబన్ నిర్ణయించారు. ఓ నిర్మాత ద్వారా హౌస్ఫుల్ డీవీడీని ముంబాయిలో ఉన్న అమితాబ్కు పంపినట్లు పార్తీబన్ తెలిపారు. బిగ్ బీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందని పార్తీబన్ చెప్పారు.