తాజాగా అమితాబ్ ముంబై నగరంలో నివాసం ఉంటున్న వలస కార్మికులని ఉత్తర ప్రదేశ్కి పంపేందుకు 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ముంబై నగరం నుంచి 43 మంది మంది పిల్లలు, 225 మంది వలస కార్మికులతో వెళుతున్న 10 బస్సులకు పచ్చజెండా ఊపి వీడ్కోలు పలికారు. వలసకార్మికులను తీసుకొని వెళుతున్న బస్సులు ప్రయాగరాజ్, గోరఖ్ పూర్, భదోయ్, లక్నో ప్రాంతాలకు వెళతాయని ఏబీసీఎల్ ఎండీ రాజేష్ యాదవ్ చెప్పారు. 1983వ సంవత్సరంలో హాజీఅలీ దర్గాలో అమితాబ్ కూలీ సినిమాను చిత్రీకరించారు. ఆ చిత్రీకరణలో అమితాబ్ తీవ్రంగా గాయపడి కొన్ని నెలల తర్వాత కోలుకున్నారు. హాజీఅలీ దర్గాతో అమితాబ్ కు మంచి అనుబంధం ఉండగా, అక్కడి కార్మికులను వారి స్వస్థలాలకు పంపించేందుకు అమితాబ్ 10 బస్సులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు వలసకార్మికులకు కొన్ని వారాలుగా అమితాబ్ ఆహారం, మందులు అందిస్తున్నారు. బస్సుల్లో తరలిస్తున్న వలసకార్మికులకు మాస్క్ లు, శానిటైజర్లు, గ్లోవ్స్, వాటర్ బాటిళ్లు, ఆహారప్యాకెట్లు, పళ్లరసాలు, గ్లూకోజ్, మందుల కిట్ ను అందించామని ఏబీసీఎల్ ప్రతినిధులు చెప్పారు. 52 మంది కూర్చొనే బస్సులో కేవలం భౌతిక దూరం పాటిస్తూ కేవలం 25 మందిని మాత్రమే పంపించామని చెప్పారు. ఇప్పటికే అమితాబ్ లక్షమంది రోజువారి వేతనం పొందే కార్మికులకి అండగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు సెలబ్రిటీలు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సోనూసూద్ బస్సులు, ఫ్లైట్స్ ద్వారా వలస కార్మికులని సొంత స్థలాలకి పంపారు.
previous post
ఆర్టికల్ 370 అప్రజాస్వామికం అంటున్న విజయ్ సేతుపతి