బీజేపీ నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుండగా ఇప్పటి నుంచే అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ దిశగా నేటి ఉదయం 11 గంటలకు ఆయన వివిధ రకాల సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు.
బెంగాల్ లోని బీజేపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఈ ప్రచారం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మార్చే ఓ ర్యాలీ వంటిదని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఇది ఆన్ లైన్ లో జరుగుతున్న మెగా ఈవెంట్ అని తెలిపారు. వర్చువల్ సమావేశాల్లో వరల్డ్ రికార్డును సృష్టిస్తుందని ఆయన అన్నారు. కాగా బీహార్ లో రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైగా ఎల్ఈడీలను ఏర్పాటు చేశామని, మొత్తం 43 లక్షల మందికి పైగా ప్రజలు అమిత్ షా ప్రసంగాన్ని వీక్షించారని బీజేపీ నేతలు వెల్లడించారు.
ఇక ఈ సమావేశంపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దీంతో బీజేపీ ఏం ఆశిస్తుందో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు. ఇదే తరహాలో తాము జూలై 21న భారీ ర్యాలీని అమరవీరుల స్మృత్యర్థం నిర్వహించనున్నామని అన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్యా గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయన్న సంగతి తెలిసిందే.