telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా  రోగుల కోసం రైల్వే కోచ్ లు: అమిత్ షా

amith shah bjp

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులపై ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా రైల్వే కోచ్ లు కేటాయిస్తున్నామని తెలిపారు.

ఢిల్లీకి కేంద్రం 500 రైల్వే కోచ్ లను అందిస్తుందని వెల్లడించారు. రైల్వే కోచ్ ల ద్వారా 8 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా వివరించారు. ఈ రైల్వే కోచ్ లో కరోనా రోగులకు అన్ని సదుపాయాలు ఉంటాయని అన్నారు. వచ్చే రెండ్రోజుల పాటు ఢిల్లీలో కరోనా టెస్టులు రెట్టింపు చేయాలని, మరో 6 రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దేశ రాజధానిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో ఆసుపత్రులన్నీ క్రిక్కిరిసిపోయాయి. బెడ్లు ఖాళీ లేక రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బయటి వారికి తాము వైద్యం చేయలేమని సీఎం చేతులెత్తేసే పరిస్థితి కూడా వచ్చింది.

Related posts