కాసేపట్లో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకోవాలని చూస్తున్న చైనాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అన్ని విధాలుగా అర్హుడని, ఈ ఉగ్రవాదుల జాబితాను అప్డేట్ చేయకుండా చైనా అడ్డుపడటం అమెరికాతో పాటు ఆ దేశ ప్రయోజనాలకు కూడా విరుద్ధమేనని అమెరికా విదేశాంగ ప్రతినిధి రాబర్ట్ పాలాడినో అన్నారు.
కీలక సమావేశానికి ముందు అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను ఈసారి అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే దేశాలు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చాయి. ఇప్పటికే ఈ అంశంపై మూడుసార్లు చర్చలు జరగగా.. ప్రతిసారీ చైనా అడ్డుపడింది. ఈసారి కూడా డ్రాగన్ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అజర్.. జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడని, అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని రాబర్టో అన్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీ సమావేశంలో జరగబోయే చర్చల గురించి మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. కానీ ఖచ్చితంగా ఈ జాబితాలో మసూద్ అజర్ను చేర్చేందుకు కృషి చేస్తామని మాత్రం స్పష్టం చేశారు.