అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఆ దేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ చర్యతో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ‘సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్పీ) కింద అమెరికా మార్కెట్లలో భారత్కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాం.
భారత మార్కెట్లలోనూ మన దేశానికి అలాంటి సదుపాయాలు కల్పించాలని అమెరికా కోరినప్పటికీ.. భారత్ దానిపై స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. అందుకే భారత్కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నా’ అని యూఎస్ కాంగ్రెస్కు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. జీఎస్పీ ప్రోగ్రామ్ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తోంది. అందులో భారత్ ఒకటి. దీని ద్వారా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు మన దేశానికి వీలుంది. ఇప్పుడు ఆ హోదాను తొలగిస్తే.. భారత్ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులకు అమెరికా సుంకాలు విధిస్తుంది. దీని వల్ల దేశానికి భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉంది.
భారత్తో పాటు టర్కీకి కూడా ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. గత నాలుగున్నర దశాబ్దాల్లో టర్కీ ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధి చెందిందని, అందుకే ఇక ఆ దేశానికి ప్రాధాన్యత హోదా అవసరం లేదని ట్రంప్ మరో లేఖలో పేర్కొన్నారు.
ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా