ఇటీవల జీఎస్టీ చెల్లించలేదని నటుడు మహేష్ బాబుపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్టు తెలుస్తుంది. గతంలో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినప్పటికీ, నటుడు మహేశ్ బాబుకు చెందిన మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్, ఆ మేరకు తగ్గించకుండా ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న వివాదంలో చిక్కుకుంది. ఈ థియేటర్పై దాడిచేసిన జీఎస్టీ అధికారులు.. జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు పాత జీఎస్టీ ప్రకారమే ప్రేక్షకుల నుంచి వసూలు చేసినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం సినిమా టికెట్లను 28 శాతం పరిధి నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చి వినోద భారాన్ని తగ్గించింది.
ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం ప్రేక్షకుల నుంచి జీఎస్టీ రూపంలో అధికంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను చెల్లించింది. ఈ మొత్తాన్ని సంక్షేమ నిధికి జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. టికెట్ల అంశం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలో ఉండడం వల్లే జీఎస్టీని తగ్గించలేదని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్కు లేఖ రాసింది.