మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో మలయాళ నటుడు జయరామ్ నటిస్తుండగా… సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించడంతో తాజా ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది (2020) సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేష్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్ అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఈ సినిమా సెట్లో అల్లు అర్జున్, కో డైరెక్టర్కు మధ్య గొడవ జరిగిందని, దీంతో షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బన్నీ నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యం కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సాధారణంగా సన్నివేశం చిత్రీకరణకు రెఢీ అయినప్పుడు కో డైరెక్టర్ వెళ్లి హీరోను పిలుస్తుంటాడు. అలా షాట్ రెడీ కాగానే సత్యం వెళ్లి బన్నీకి చెప్పాడట. హీరో షాట్లోకి రాకపోయేసరికి సత్యం రెండు సార్లు బన్నీ వద్దకు వెళ్లి షాట్ రెఢీ అయ్యిందని చెప్పాడట. మామూలుగా అయితే షాట్కి వెళ్లాల్సిన బన్నీ విసుగ్గా సీన్ పేపర్స్ను సత్యం ముఖం మీద విసిరి కొట్టాడని తెలుస్తోంది. దీంతో కో డైరెక్టర్కి కోపం వచ్చి సెట్ నుండి వెళ్లిపోయాడట. ఈ సంఘటనతో కొంత సేపు షూటింగ్ ఆగిపోయిందని టాక్. అయితే ఈ వార్తలపై బన్నీ వర్గం కూడా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. నిజానికి బన్నీ కో డైరెక్టర్ మీద కోపంతో అలా ప్రవర్తించలేదట. ఆయన వ్యక్తిగతంగా ఓ చోటకి వెళ్లాల్సి ఉందట. కానీ షూటింగ్ కారణంగా మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడట. సరే షూటింగ్ కంటిన్యూ చేద్దామనుకుంటే.. కో డైరెక్టర్ వచ్చి తదుపరి షెడ్యూల్కు గ్యాప్ ఉంటుందని చెప్పాడట. దీంతో బన్నీ అప్సెట్ అయ్యాడట. కో డైరెక్టర్ సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే తన ప్లాన్ పాడైందని బన్నీ భావించాడట. అలాగే షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యిందనే మాట నిజం కాదని, ఆ సన్నివేశంలో బన్నీతో నటించాల్సిన సీనియర్ యాక్టర్ మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో షూటింగ్ను ఆపారని తెలియజేశారు.