ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని చెప్పారు. దశలవారీగా మద్య నిషేధం అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా గురువారం సామినేని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా 86 శాతం సీట్లు గెలుచుకున్న పార్టీ వైసీపీ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ఇచ్చిన హమీలు అమలుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వాటికి సంబంధించి జీవోలు కూడా జారీ చేశారని సామినేని ఉదయభాను అన్నారు. ఇంత త్వరగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పనులు జరగలేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ ఇలా అందరి సమస్యలు జగన్ పరిస్కరించారని సామినేని అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా రాజన్న రాజ్యం మళ్లీ రావాలని ఎదురు చూస్తున్నారన్నారు. మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేయడం జరుగుతుందని, జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి అని, ఏపనైనా చేయాలనుకుంటే చేస్తారని, విజన్ ఉన్న వ్యక్తి అని సామినేని ఉదయభాను కొనియాడారు.