లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ పార్టీ ఎన్నికల ప్రచారంలో విచిత్రమైన హామీలు గుప్పించింది. తమకు ఓటు వేస్తే మద్యంపై 50 శాతం డిస్కాంట్ ఇస్తామని, పండుగల సందర్భంగా ముస్లిం కుటుంబాలకు మేకలను ఉచితంగా ఇస్తామని ఢిల్లీలోని సాంజీ విరాసత్ పార్టీ హామీ ఇచ్చింది.
అంతేగాకుండా మహిళలకు ఉచితంగా బంగారం అందజేస్తామని తెలిపింది. పీహెచ్డీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచితంగా బస్సు, మెట్రో ప్రయాణం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు, ఉచితంగా నిత్యావసరాల పంపిణీ, ఆడపిల్ల పుడితే రూ.50వేలు, అమ్మాయి పెండ్లికి రూ.2.5 లక్షలు, నిరుద్యోగ భృతి రూ.10000, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5000 పింఛన్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు ఇలా పలు హామీలను కురిపించింది.