సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా తాము మేనిఫెస్టోను రూపొందించామని అఖిలేశ్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ ప్రస్తుతం పేదలకు, ధనికులకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ఇప్పుడుండే ప్రభుత్వం ధనవంతులకే అండగా ఉంటోంది. కానీ మేం అందర్నీ ఒకేలా చూడాలనుకుంటున్నాం. అందర్నీ ఏకతాటిపైకి తెస్తాం.
ఇక రైతుల సమస్యలు దేశంలో ఎలా ఉన్నాయో తెలియంది కాదు. తమ సమస్యలను తీర్చాలంటూ వారు రోడ్ల మీదకొస్తున్నారు. ముందు చూపుతో ఆలోచించాం. సామాజిక న్యాయం లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఇప్పటి ప్రభుత్వం అభివృద్ధి పేరు చెప్పి నిరుద్యోగితను పెంచింది. రైతు బంధుగా మేముంటాం. రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. వారికి రుణ విముక్తి కల్పించి ఆదాయ వనరులను పెంచుకునేలా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు ప్రజలందరూ నియంత పాలనలో ఉన్నారు. వారిప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తాం’ అని హామీ ఇచ్చారు.