ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ రోజు ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ… తాను ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానని అన్నారు. తనకు అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్ ఫీల్డ్లో ఉన్నానని, దాన్ని వదిలేశాను కాబట్టే ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నానని చెప్పారు. తనను హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగా విని షాక్ అయ్యానని అన్నారు.
తనపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నానని చెప్పారు. అఖిలప్రియపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తనపై ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తనను ఆమె ఆళ్లగడ్డ రమ్మంటోందన్నారు. తనను చంపించాల్సిన అవసరం అఖిలప్రియకు ఏముందని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తన మిత్రుడు భూమా నాగిరెడ్డితో తనకున్న అనుబంధం గురించి ఆళ్లగడ్డలో స్థానిక నేతలను అడిగితే తెలుస్తుందన్నారు.