ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ మారుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె స్పందించారు. టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొందరు తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని వెల్లడించారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో టీడీపీ తరపున గెలిచి, చంద్రబాబుకు కానుకగా ఇస్తానని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రి అఖిలప్రియ తెలిపారు.