ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఎండీ అచల్ ఖరే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్ధేశిత గడువును దృష్టిలో పెట్టుకుని పనులు ముందుకు సాగుతున్నామని తెలిపారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టుకు 1380 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా ప్రస్తుతం 622 హెక్టార్లు(45శాతం) సేకరించాం. ఈ ప్రాజెక్టును నిర్దేశిత గడువు డిసెంబర్ 2023ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బుల్లెట్ రైలు ముంబయి, అహ్మదాబాద్ నగరాల మధ్య రోజుకు 70 రౌండ్లు(ఒక్క మార్గానికి 35 సార్లు) తిరుగుతుంది.
టికెట్ ధర దాదాపు రూ.3వేల వరకు ఉండే అవకాశం ఉందని ఖరే అన్నారు. ప్రాజెక్టును మొత్తం 27 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నట్లు, ఇప్పటికే సముద్రగర్భ మార్గంతో కలిపి నాలుగు ప్యాకేజీలకు సివిల్ పనుల నిమిత్తం టెండర్లు జారీ చేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం అంచనా విలువ రూ.1.08లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం సేకరించే భూమిలో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిహారం చెల్లిస్తుంది. ఈ రైలు కారిడార్ ఉండే మొత్తం 508 కిలోమీటర్ల పరిధిలో 12 స్టేషన్లు ఉంటాయి’ అని ఖరే తెలిపారు.