జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ అన్సర్ ఘజ్వతుల్ హింద్(ఏజీహెచ్) అనే ఉగ్రవాద సంస్థ ఇక తుడిచిపెట్టుకుపోయినట్లేనని తెలిపారు. భారత దళాలు అవంతిపొరాలో జరిపిన ఎన్కౌంటర్లో ఏజీహెచ్ నాయకుడు అబ్దుల్ హమీద్ లెల్హరీతో పాటు మరో ఇద్దరిని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏజీహెచ్ ఉగ్ర సంస్థ తుడిచిపెట్టుకుపోయినట్లేనని డీజీపీ ఓ మీడియా సమావేశంలో తెలిపారు. హమీద్ ప్రస్తుతం అల్ఖైదాతో అనుబంధంగా ఉన్న ఏజీహెచ్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు జైషేతో కూడా అనుబంధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఉగ్రవాది జకీర్ ముసాను మట్టుబెట్టిన తర్వాత ఈ ఏజీహెచ్కు హమీద్ నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. 2016లో ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించిన హమీద్ పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని తెలిపారు. ఆగస్టు 5 తర్వాత ఎక్కువ మంది యువకులు ఉగ్రవాదంలో చేరతారని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవని, వాటిల్లో యువత చేరికలు తగ్గిపోయాయని అన్నారు. అదేవిధంగా స్థానిక యువత తమకు సహకరిస్తే ఉగ్రవాదాన్ని విజయవంతంగా నిర్మూలిస్తామని అన్నారు.