శ్రీనగర్లో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. నగరం మొత్తం జవాన్లను మొహరింపజేయడమే కాకుండా పలు చోట్ల బంకర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటరీ శిబిరాలు, గతంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న ఆస్పత్రులు, శ్రీనగర్ ఎయిర్పోర్టు తదితర కీలక ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించామన్నారు. సరిహద్దు వెంట ఉండే ప్రాంతాల్లోని పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కీలక ప్రాంతాల్లో మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
శ్రీనగర్ సహా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కొందరు యథేచ్ఛగా తిరుగుతున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ రెండు రోజులుగా కశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితిని సమీక్షించిన ఆయన భద్రత అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు.