హైదరాబాద్ ప్రపంచ క్రియాశీల(డైనమిక్) నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్ఎల్’రూపొందించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. 2020 సంవత్సరానికి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలోని మొదటి 20 స్థానాల్లో మనదేశానికి చెందిన 7 నగరాలు చోటు సంపాదించాయి. వరుసగా 2, 5, 7, 12, 16, 20 స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్కతా, ముంబై నగరాలు నిలిచాయి. హైదరాబాద్ నగరం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో హైదరాబాద్ టాప్-20 నగరాల జాబితాలో సైతం చోటు సంపాదించలేకపోయిందన్నారు.
2015లో 28, 2016లో 5, 2017లో 3వ స్థానం సంపాదించిన హైదరాబాద్ 2018లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2019లో బెంగళూరుతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్న హైదరాబాద్, 2020లో బెంగళూరును రెండో స్థానంలోకి నెట్టి మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ నగర భవిష్యత్తుపై అనుమానాలు ఉండేవని, నగరం క్రమంగా అభివృద్థిపథంలో నడవడంతో ఇవన్నీ పటాపంచాలయ్యాయన్నారు. ఈ పరిశోధన నివేదిక ఆషామాషీ పత్రం కాదని, ఆక్స్ఫర్డ్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఐక్యరాజ్యసమితి డేటాను వినియోగించుకుని 130 నగరాలపై అధ్యయనం జరిపాయన్నారు. హైదరాబాద్ నగరం ఇన్నోవేషన్ ఎకానమీ రంగం లో షెంజాయ్, షాంగాయ్ నగరాలతో పోటీ పడుతుందని పేర్కొనడం హర్షదాయకమన్నారు.
థ్యాంక్స్ టు కరోనా వైరస్ స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం… హీరో నిఖిల్ కామెంట్