తెలంగాణలో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏప్రిల్ తర్వాత పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాల పై చర్చించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ తనకున్న సమాచారం మేరకు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఈలోగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తరహాలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముందుగా దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి పలు అంశాలపై అధ్యయనం నిర్వహించాలని సూచించారు.