ఎన్నికల సందర్భంగా మద్యం గిరాకీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కల్తీ సరుకు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కల్తీ మద్యం తాగి 30 మంది మృతిచెందారు. యూపీలోని సహరన్పూర్, ఖుషీనగర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించినట్లు ఖుషీనగర్ జిల్లా మేజిస్ర్టేట్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 9 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని వెల్లడించారు.
ఈ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ఇవ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసింది.