భారతజట్టు తమతో డే/నైట్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించొచ్చని ఆసీస్ మాజీ వికెట్కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. మొదట్లో తానూ గులాబి బంతి టెస్టులను వ్యతిరేకించానని పేర్కొన్నాడు. భారత్, బంగ్లాదేశ్ తొలిసారి డే/నైట్ టెస్టు ఆడుతుండటంతో గిల్లీ స్పందించాడు. గతేడాది కోహ్లీసేన పర్యటించినప్పుడు తమతో గులాబి టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించగా బీసీసీఐ అంగీకరించని సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత వేసవిలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా డే/నైట్ టెస్టు ఉంటుందని అనుకుంటున్నా. ప్రస్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అలాంటి ప్రతిపాదన వినలేదు. కానీ ఓ మ్యాచ్ ఉంటుందనే భావిస్తున్నా. తొలుత డే/నైట్ టెస్టులను నేను వ్యతిరేకించా. ఇప్పుడు టెస్టు క్రికెట్కు అవసరమైన సానుకూల ఫలితాలను చూస్తున్నానని గిల్క్రిస్ట్ అన్నాడు.
మంచు తరహా సమస్యలు డే/నైట్ టెస్టుల్లో ఎదురవుతాయి. ఏ సిరీస్లు, ఏ వేదికల్లో ఆడాలో నిర్ణయించేందుకు సమయం పడుతుంది. సంధ్య వెలుతురులో ఆడటం కాస్త కష్టమే. అయితే పిచ్లపై కవర్లు కప్పకుండా, హెల్మెట్లు లేకుండా ఆడిన రోజులు ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ఇప్పుడు ఆటను బతికించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్నీ స్వాగతిస్తున్నాను. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్తో ప్రతి మ్యాచ్ విలువ, పోటీ పెరిగాయి. టెస్టు క్రికెట్ను ఎక్కువగా చూసే రోజులు బహుశా పోయాయనే అనుకుంటున్నా. భారత్×ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్లు ఇప్పటికీ అభిమానులను ఆకర్షిస్తున్నాయని గిల్లీ తెలిపాడు.