కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పాటించాలనీ కోరగా.. కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆయన మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ను ప్రకటించారు. లాక్ డౌన్లో భాగంగా అత్యవసర సేవలు మినహా ఏవీ అందుబాటులో ఉండవని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో ఎలా ఉన్నారో.. అలానే ఇళ్లకు పరిమితం కావాలని స్పష్టం చేశారు. ఈ చర్యల్లో భాగంగా ప్రతి కార్డుకు నెలకు 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని.. లాక్డౌన్ కాలంలో రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 ఇస్తామని వెల్లడించారు. అందుకోసం రూ.1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రజారవాణా కూడా అందుబాటులో ఉండదని అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నటి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి సమర్ధించారు. తన మద్దతు తెలిపారు. దీనికి సంబందించి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది’.. అంటూ సోషల్ మీడియా వేదికగా తన మద్దుతును ప్రకటించారు.
previous post