పాత్రికేయులు, ఇటీవల సినీ నటి వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నటి వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘గెలిచి వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రతిభావంతులను సినీప్రముఖులు అభినందిస్తున్నారు. ముందుగానే వారి ప్రతిభను ఎందుకు గుర్తించడం లేదు?’ అని వరలక్ష్మిని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. ‘అలా ప్రతిభ ఉన్న వారికి వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీపై (మీడియా) ఉంది. మీ వార్తల ద్వారా వారి ప్రతిభను చాటిచెప్పాలి. సినిమా ఆడియో వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యతను ఇలాంటి వారి కార్యక్రమాలకూ ఇవ్వాలి.
అప్పుడే ప్రతిభావంతులు ప్రపంచానికి తెలుస్తారు. ముందు మీ కర్తవ్యాన్ని సరిగ్గా చేయండి’ అని ఆమె సలహా ఇచ్చారు. దీని తో ఆశ్చర్యపోవడం ఆ పాత్రికేయుడి వంతైంది. అనంతరం మరో విలేకరి ప్రశ్నిస్తూ.. ‘క్రీడాకారిణి గోమతి మారిముత్తుకి మీరు ఏదైనా సహాయం చేశారా?’ అని అడిగారు. ‘నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. సినీ పరిశ్రమలో ఉన్న కొందరు సహకరిస్తున్నారు. నేను కూడా చేయాలనుకుంటున్నా. ఇంతకీ మీరు చేశారా?.. అని ఎదురు ప్రశ్నించారు వరలక్ష్మి. అందుకు ‘లేదు’ అని పాత్రికేయుడు చెప్పడంతో ‘ముందు మీరు సహకరించండి. ఆ తర్వాత నాలాంటి సెలబ్రిటీలను అడగొచ్చు’ అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆమె తరహాలో వ్యవహరించడంపై పలువురు పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.