తమిళ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు సూర్య. ప్రస్తుతం సూర్య కేవీ ఆనంద్ దర్శకత్వంలో “కాప్పాన్” అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు ప్రముఖ హీరోలు ఉండడంతో ముగ్గురు హీరోల అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో కనిపించనున్నారు. అల్లిరాజా సుభాష్కరణ్, కేఈ జ్ఞానవేల్ రాజాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య సినిమాలే కాదు శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ద్వారా తన శక్తి మేర సమాజ సేవ కూడా చేస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం.. శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉతీర్ణత సాధించిన పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించారు హీరో సూర్య. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న కొత్త విద్యా విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. నీట్ విధానాన్ని సూర్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యావిధానంపై ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే సూర్య వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం స్వాగతిస్తున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన సినిమాల విడుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.