బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆయన కార్యాలయాలపై గత మూడు రోజులుగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నప్పుడు సోనూసూద్ చాలా మంది వలస కార్మికులు వారి సొంత ఇళ్లకు వెళ్లడంలో సహాయపడ్డారు. పేద ప్రజలకు ఆహారం, చదువుకోవడానికి డబ్బు లేనివారికి సహాయం చేయడంతో అందరూ ఆయనను మానవతావాది అంటూ పొగిడారు. చాలా మంది అభిమానులు ఆయనను దేవుడు, రియల్ హీరో అని కూడా అంటారు.
ఆయన చేస్తున్న సేవ కారణంగా సోనూసూద్ పేరు మీద ఆలయాన్ని నిర్మించారు. సోను 16 నగరాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. స్కాలర్షిప్ వంటి కార్యక్రమాలను చేపట్టాడు. ఇంకా కొంతమందికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడుల విషయమై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తాజాగా బయటకు వచ్చిన విషయం ఆయన అభిమానులను కూడా షాక్ కు గురి చేస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ సోనూసూద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ ముంబై కార్యాలయాల్లో సెర్చ్ చేశారు. లక్నో, ముంబై, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గుర్గావ్లోని ఆయనకు సంబంధించిన 28 కార్యాలయాల్లో ఐటీ బృందం ఏకకాలంలో సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు లభించాయి. సోనుసూద్ ఆదాయపు పన్ను శాఖను రూ. 20 కోట్ల వరకు మోసం చేసినట్టు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం 2020 జూలై 21న ప్రారంభమైన ఛారిటీ ఫౌండేషన్ కు ఈ సంవత్సరం మార్చి 1 నుండి దాదాపు రూ .18.94 కోట్లు విరాళంగా వచ్చాయి. అందులో కేవలం రూ .1.9 కోట్లు మాత్రమే సామాజిక సేవ కోసం ఉపయోగించారు. అయితే రూ .17 కోట్లు ఇప్పటికీ ఈ ఛారిటీ ఫౌండేషన్ ఖాతాలో ఉన్నాయి. అయితే రాజకీయ కక్షతోనే సోనూ సూద్పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అతడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసి, దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సోనూపై ఇలా ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు: నక్కా ఆనంద్ బాబు