బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మంగళవారం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు న్యూస్ ఛానెల్ ఆజ్ తక్ వెల్లడించింది. ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్లో ముంబై చేరుకున్నారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే, మూడు రోజుల క్రితమే అంటే శనివారం (ఏప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) కన్నుమూశారు. అయితే, రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. దీంతో ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లారట. దీని వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అంటున్నారు. ఇర్ఫాన్ ఖాన్ భార్య, ఆయన ఇద్దరు కుమారులు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారని తెలిసింది.
previous post