ఆప్ అభ్యర్థి అతిశి, మాజీ క్రికెటర్, ఢిల్లీ ఉత్తర ప్రాంత బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తన గురించి అభ్యంతరకర పదజాలంతో ముద్రించిన కొన్ని లక్షల కరపత్రాలను పంచారని పేర్కొంటూ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. కరపత్రంలో ప్రస్తావించిన అంశాలను మీడియా ఎదుట చదువుతూ అతిశి కన్నీరు పెట్టుకున్నారు. గంభీర్ వంటి వ్యక్తి ఎన్నికైతే మహిళలు సురక్షితంగా ఉంటారా? అని ఆమె ప్రశ్నించారు.
గంభీర్ ఈ విషయమై స్పందిస్తూ, ఎన్నికల్లో విజయం సాధించేందుకు అతిశి కన్నీళ్లను అస్త్రంగా చేసుకున్నారని విమర్శించారు. మురికితో ఉన్న మీ మెదడును శుభ్రం చేసేందుకు మీ చీపురును వేరొకరికి ఇవ్వాలని పేర్కొన్నారు. తానే ఆ కరపత్రాలను పంచానని నిరూపిస్తే వెంటనే పోటీ నుంచి తప్పుకుంటానని, అది అవాస్తమైతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని గంభీర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.