సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నుంచి రాజకీయ వలసలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి, సుజనాచౌదరితో సహా పలువురు సీనియర్ నేతలు బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత భూమా అఖిలప్రియ కుటుంబీకులు భూమా కిషోర్ రెడ్డి, మహేశ్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డా సమక్షంలో కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వీరు బీజేపీలో చేరారు. వీరికి కండువా కప్పి జేడీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరినట్లు ప్రకటించారు.