హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అయితే ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో విషాదం నెలకొంది. నగరంలోని పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో వర్షభీభత్సానికి గౌస్ నగర్ లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. 9 మంది మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నగరంలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొండకింద ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.