ఉత్తర మయన్మార్లోని జేడ్ మైనింగ్ సైట్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కచిన్ స్టేట్లోని హెచ్పాకంత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలం నుంచి 3 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా 54 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మయన్మార్ ప్రజాప్రతినిధి టిన్సోయ్ తెలిపారు.
కార్మికులంతా మైనింగ్ స్థలంలోని బురదలో చిక్కుకున్నారని, సహాయక చర్యలు చేపట్టడం అంత సులభంగా అయే పని కాదన్నారు. మైనింగ్ ప్రాంతంలో నిర్మించబడిన రిజర్వాయర్ బురద చరియలు కార్మికులపై పడ్డాయని తెలిపారు. కార్మికులు మాత్రమే కాకుండా మైనింగ్ సామాగ్రి, బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్రాలు కూడా బురదలో కూరుకుపోయాయని వెల్లడించారు.
కార్మికులు సుమారు 100 అడుగుల లోతు బురదలో కూరుకుపోయారని, అంత లోతులో ఉన్న బురదను తొలగించేందుకు యంత్రాలు కూడా అందుబాటులో లేవన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.