న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సవాళ్లను ఎదుర్కొంటుందని అందరూ అనుకున్నారు. అయితే వార్ వన్సైడ్ అయిపోయింది. ఇప్పటికే మూడు టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. క్లీన్స్వీప్పై గురి వేసింది. ఇరు జట్ల మధ్య నేడు నాలుగో టీ20 వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. మూడో టీ20 హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒంటి చేత్తో టీమ్కు విజయం అందించాలని చివరి బంతి వరకు ప్రయత్నించాడు. కానీ భారత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో అది కాస్తా టై అయ్యి.. సూపర్ ఓవర్కు చేరింది. ఇక అందులో హిట్మ్యాన్ వరుస సిక్సర్లతో విజయాన్ని అందించాడు. మరోవైపు కివీస్ సిరీస్లోని చివరి రెండు మ్యాచ్లు గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
టీమిండియా రిజర్వు బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే టీ20 ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. శార్దూల్, చాహల్, శివమ్ దూబే స్థానాల్లో సైనీ, కుల్దీప్, పంత్లు తుది జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కు కూడా విశ్రాంతిని ఇవ్వాలని యాజమాన్యం చూస్తోందట. ఒకవేళ అదే గనక జరిగితే సంజూ శాంసన్ను ఆడించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 సిరీస్ను వైట్వాష్ చేసి.. వన్డే సిరీస్ను ఫుల్ జోష్తో ప్రారంభించాలని చూస్తున్న నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు మాత్రం ఉండే అవకాశమైతే లేదు.