ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వివిధ శాఖాలలోని ఉన్నతాధికారులకు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం రాత్రికి రాత్రి 47 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా మద్దాడ రవిచంద్రను నియమించగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనాను నియమించింది.ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ ఎండీగా వాణీమోహన్ నియమించారు.
కార్మిక శాఖ కమిషనర్గా డి.వరప్రసాద్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా భానుప్రకాశ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్గా హెచ్.అరుణ్ కుమార్, ఏపీ టూరిజం అథారిటీ ఎండీగా ప్రవీణ్ కుమార్, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ కమిషనర్గా కె.కన్నబాబు, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వై.మధుసూదన్రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ ముఖ్య కార్యదర్శిగా బి.ఉదయ లక్ష్మి, ఇంటర్ బోర్డు కమిషనర్గా కాంతిలాల్ దండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.