విదేశాలలో ఉద్యోగం అనగానే మనవాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఉన్నదేశంలో ఎలాగూ భారీగా నిరుద్యోగ సమస్యతో అలమటిస్తున్న వారి నిస్సహాయతను అడ్డుపెట్టుకొని, కొందరు ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్ధలో ఉద్యోగం కోసం తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నలుగురు యువతులు దుబాయ్ వెళ్లారు. తీరా అక్కడ వారితో బార్లో డాన్స్లు చేయించడంతో వారికి అసలు కథ అర్ధమైంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూరుకు చెందిన 20ఏళ్ల వయసు కలిగిన యువతులు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్ధ తరపున ఉద్యోగాల కోసం దుబాయ్కి చేరుకున్నారు.
ఆ నలుగురు నమ్మిన సంస్ధ నిర్వాహకులే వీరిని గదిలో బంధించి బార్లో డాన్స్లు చేసేలా ఒప్పించారు. దీంతో షాక్ తిన్నయువతులు వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భారత విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయడంతో దుబాయ్లో భారత రాయభార కార్యాలయ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే దుబాయ్ పోలీసులు యువతులు బంధీలుగా ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్ధ నుంచి నలుగురు మహిళల్ని కాపాడారు.
దుబాయ్ నుంచి వీరిని ప్రత్యేక విమానంలో కేరళలోని కోజికోడ్కు పంపినట్టు దుబాయ్ కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. ఉద్యోగం కోసం దుబాయ్కి తీసుకెళ్లి మోసం చేసిన ఈవెంట్ సంస్ధ, దానికి సంబంధించిన ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాస్తామని కూడా ఆయన వెల్లడించారు.