వరల్డ్ కప్ ఫేవరేట్ గా ఉన్న భారత్, హఠాత్పరిణామాలతో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దానితో కోచ్ ల మార్పుపై బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది. టీమిండియాకు కొత్త కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలం ప్రపంచకప్ తో ముగిసినా వచ్చే నెలలో విండీస్ పర్యటన ఉండడంతో మరో 45 రోజులు పొడిగించారు. అయితే, రవిశాస్త్రిని అంతకుమించి కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కొత్త కోచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.
గతంలో కోచ్ ల ఎంపికలో 9 నిబంధనలు, ఈసారి మూడంటే మూడే నిబంధనలు :
* టీమిండియా ప్రధాన కోచ్ అభ్యర్థి టెస్టు హోదా కలిగిన దేశానికి మినిమమ్ రెండేళ్ల పాటు కోచ్ గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. లేదా, ఐసీసీ అనుబంధ సభ్యదేశానికి కానీ, ఏ దేశానికైనా చెందిన ఎ-జట్లకు కానీ, ఐపీఎల్ జట్టుకు కానీ మూడేళ్లు కోచ్ గా పనిచేసిన అనుభవం ఉండాలి.
* కనీసం 30 నుంచి 50 టెస్టు మ్యాచ్ లు ఆడిన అనుభవజ్ఞులై ఉండాలి.
* వయసు 60కి మించకూడదు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు కూడా ఇవే నిబంధనలు వర్తించినా, ఆడిన మ్యాచ్ ల సంఖ్యను తగ్గించారు. వారు 10 టెస్టులు, 25 వన్డేలు ఆడిన అనుభవజ్ఞులై ఉంటే సరిపోతుందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.