ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన విజయసాయి ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గత ఐదేళ్లలో తాను చేసిన మంచి పనుల గురించి చెప్పి ఓట్లు అడగాలే తప్ప, ఓట్లు అమ్మితే నేను కొనుక్కుంటానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. నన్ను జైలుకు పంపిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకుని ప్రజలను దేబిరించడం దద్దమ్మలు చేసే పని అని విమర్శించారు.
ఎన్నికల అనంతరం చంద్రబాబు జైలుకే వెళతారే లేక సింగపూర్ పారిపోతారో ప్రజలకు ఏంటి సంబంధం అని విజయసాయి తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. అంతకుముందు మరో ట్వీట్ చేసిన విజయసాయి, మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 22 మంత్రులు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వం జారీచేసిన జీఓ చెల్లదని, ఓటమి తప్పదని తెలిసే ఇలాంటి చర్యలకు దిగారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ క్రిమినల్ కేసులను మళ్లీ తెరుస్తామని విజయసాయి హెచ్చరించారు.