64 మంది సుబాబుల్ పంట సాగుచేస్తున్న రైతులు, ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐటీసీ కాగితం పరిశ్రమ సౌజన్యంతో 10వేల హెక్టార్లలో రెండు జిల్లాలవ్యాప్తంగా రైతులు సుబాబుల్ పంట సాగుచేస్తున్నారు.
ఐటీసీ కాగితం పరిశ్రమ రైతుల నుంచి సుబాబుల్ కర్ర కొనుగోలు చేయడంలో అనేక ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ధర దారుణంగా తగ్గించి వేసింది. ఒక మెట్రిక్ టన్ను సుబాబుల్ ధర రూ.6,100గా గతంలో నిర్ణయించగా.. ప్రస్తుతం కాగితం పరిశ్రమ మెట్రిక్ టన్ను ధర రూ.3 వేల నుంచి 4 వేల మధ్యనే కొనుగోలు చేస్తోంది. దీంతో సుబాబుల్ సాగుచేస్తున్న రైతులు గత 6 నెలలుగా పలు రూపాల్లో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా కనీసం 200 మంది సుబాబుల్ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మూకుమ్మడిగా నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 64 మంది రైతులు కలెక్టర్ కార్యాలయం నుంచి నామ పత్రాలు తీసుకున్నారు. ఆఖరి రోజైన సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్లు రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇటీవలే కవిత నియోజక వర్గం నిజామాబాద్ లో కూడా 500 మంది రైతులు ఎన్నికలలో పోటీకి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో కవిత పోటీ నుండి విరమించుకొని, కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. ఇదేవిధంగా ఖమ్మంలో కూడా జరుగుతుండటం విశేషం. రైతులలో ఇలాంటి ఐకమత్యం స్వాగతించదగింది అంటున్నారు విశ్లేషకులు.